'నరేంద్ర మోదీ నన్ను కాపీ కొడుతున్నారు'
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపీ కొడుతున్నారని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ ఎద్దేవా చేశారు. గ్రామాలను దత్తత తీసుకోవడం, టాయెలెట్లను నిర్మించడం వంటి పథకాలన్నీ తమవేనని చెప్పారు. 1990లోనే ఈ పథకాలను తాను ప్రారంభించానని ములయాం చెప్పుకొచ్చారు. టాయెలెట్ల నిర్మాణం ఆవశ్యకత గురించి అప్పట్లోనే ప్రజలను చైతన్య పరిచానని పేర్కొన్నారు. అప్పట్లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రముఖులు, ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
కనీసం రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని తమ పార్టీ ప్రజాప్రతినిధులను ములయాం కోరారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తించి, తమ ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను మోదీ స్వాగతించారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు అవసరమని ములయాం అభిప్రాయపడ్డారు.