ఇంటికి పిలిచి మోదీ హితబోధ

ఇంటికి పిలిచి మోదీ హితబోధ - Sakshi


న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులపై అజమాయిషీకి అంతం పలికి అభివృద్ధిపై దృష్టి సారించాలని ఉత్తరప్రదేశ్‌ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ హితబోద చేశారు. ప్రతి ఎంపీ తమ తమ నియోజకవర్గ అభివృద్ధికోసం పనిచేయాలని చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం యూపీ ఎంపీలతో తన అధికారిక నివాసం కల్యాణ్‌ మార్గ్‌లో సమావేశం అయిన సందర్భంగా సూచించారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా హాజరయ్యారు.



‘ప్రభుత్వ అధికారుల బదిలీలు, మార్పులు చేర్పులు, నియామకాల అంశాల నుంచి దృష్టిని మరల్చాలని మాకు ప్రధాని మోదీ సూచించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని యూపీకి చెందిన ఓ ఎంపీ రహస్యంగా ఈ విషయం మీడియాకు చెప్పారు. సుపరిపాలనే అభివృద్ధికి మంత్రం అని, దానిపై తప్ప మరే ఇతర అంశాలపైనా దృష్టిసారించరాదని మోదీ చెప్పినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకొస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభివృద్ధి జపంతోనే బీజేపీ యూపీ సీఎం పీఠాన్ని హస్తగతం చేసుకున్నందున తాజాగా ఎంపీలతో భేటీ అయ్యి అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top