పెట్రోలు కావాలా.. సర్టిఫికెట్ చూపించండి!!

పెట్రోలు కావాలా.. సర్టిఫికెట్ చూపించండి!!


మీ వాహనానికి పెట్రోలు గానీ, డీజిల్ గానీ పోయించాలనుకుంటున్నారా? అయితే ఇక మీదట పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సిందే. మీ వాహనం నుంచి వెలువడుతున్న ఉద్గారాలు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇంధనం నింపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నిబంధనను అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.



ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి మరో రెండు నెలల వరకు సమయం పట్టేలా ఉంది. ఈలోపు ముందు విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచి అప్పుడు అమలుచేయాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ముందుగానే అన్ని పెట్రోలు బంకుల వద్ద కూడా కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అప్పటివరకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోనివాళ్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే వాళ్లకు పెట్రోలు లేదా డీజిల్ పోస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top