అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!

అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!


కోడలికి కిడ్నీ దానం చేసిన అత్త

న్యూఢిల్లీ: అత్తలందరూ కఠిన హృదయులు కాదని ఆమె నిరూపించింది. ఆపదలో ఉన్న కోడలిని అమ్మకంటే మిన్నగా ఆదుకుని ప్రాణం పోసింది! తొలుత కిడ్నీ ఇస్తానన్న ఆ కోడలి అమ్మ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గగా, అత్త నేనున్నానంటూ ముందుకొచ్చి కిడ్నీ దానం చేసింది. మనసు కదిలించే ఈ ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కిడ్నీ పాడవడంతో బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేరింది. కిడ్నీ మార్చాలని వైద్యులు నిర్ణయించారు.



కవిత పుట్టింటి, మెట్టినింటి వారికి అదొక సవాలైంది. చివరికి ఆమె తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. సర్జరీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు నిమిషంలో కవిత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కవిత అత్త విమల(65) ‘నేను కిడ్నీ ఇస్తాను’ అంటూ ముందుకొచ్చింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు విమలకు పరీక్షలు జరిపారు. ఆమె కిడ్నీ కవితకు సరిపోతుందని నిర్ధారించారు. గత నెల 23న విమల కిడ్నీని కవితకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయిందని, అత్తాకోడళ్లు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top