గుండెపోటుతో టెకీ మృతి, బాల్కనీలోంచి దూకేసిన భార్య

గుండెపోటుతో టెకీ మృతి, బాల్కనీలోంచి దూకేసిన భార్య - Sakshi

న్యూఢిల్లీ: నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని భార్య భవనంపై దూకి ఆత్మహత్యకు  పాల్పడింది. దీంతో వీరి  అయిదేళ్ల చిన్నారి అనాధగా మారిన వైనం  స్థానికులను కలచివేసింది.

 

వివరాల్లోకి వెళితే..అనురాగ్ అగర్వాల్ (39),  మోనికా (36) భార్యభర్తలు.  సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అనురాగ్ కు మంగళవారం తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ  రాత్రి 1.30గం.లకు చనిపోయాడు.  ఈ వార్త విన్న వెంటనే మోనిక  నోయిడా ప్రతీక్‌ లారెల్ లోని తమ నివాసానికి వెళ్లింది.  8వ అంతస్తులోని  తమ ఫ్లాట్  బాల్కనీలో నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను  ఇరుగుపొరుగువారు, సెక్యూరిటీ సిబ్బంది ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు.  కానీ  ఫలితం లేకపోయింది. భర్త చనిపోయిన ఆసుపత్రిలోనే  సుమారు 2.30  గంటలకు ఆమె కూడా ప్రాణాలు విడిచింది.  అనురాగ్, మోనిక లకు  ఏడేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు అయిదేళ్ల పాప కూడా ఉంది.

 

భర్త చనిపోయిన షాక్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీస్ అధికారి  పంకజ్ పంత్ తెలిపారు.  సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని తెలిపారు.  మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు  బంధువులకు సమాచారం అందించారు. 

కాగా నోయిడా సెక్టార్ లోనే గత వారం ఎసీపీ  తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోగా , అతని భార్య బాల్కనీలోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం  సంచలనం రేపింది. ఆ సంఘటనను మరువకముందే ఇదే ప్రాంతంలో మరో దంపతులు విగతజీవులుగా మారడం  స్థానికంగా విషాదాన్ని నింపింది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top