బీజేపీ సీఎంలతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం అనంతరం బీజేపీ పాలిత 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తదితరులు కూడా పాల్గొన్నారు. అజెండాలో పేర్కొన్న మూడు నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించారని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలులో ఇబ్బందులు, ఇతర రాజకీయ అంశాలపై అందరి అభిప్రాయాల్ని తెలుసుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేశారో రాష్ట్రాల సీఎంలను అడిగి తెలుసుకున్నారని, సీఎంలు కూడా అజెండా అంశాలపై నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తమ పాలనపై ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. భేటీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో పాటు గుజరాత్, హరియాణా, గోవా, మణిపూర్, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్ప్రదేశ్ సీఎంలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు