భారతరత్నకు దళిత నేతలు పనికిరారా: మాయావతి
‘భారతరత్నకు దళిత నేతలు పనికిరారా’ అంటూ బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్పేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న ఇచ్చే సమయంలో దళిత నేతలను విస్మరించారని ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతేడాది లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని మాయావతి విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సమాజంలోని బలహీన, అణగారిన వర్గాలకోసం వారు చేసిందేమీ లేదని మండిపడ్డారు. విదేశాల్లోని నల్లదనాన్ని ఇంకా వెనెక్కి తీసుకురాలేదని విమర్శలు గుప్పించారు.
గతేడాది లోక్సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీఏ పూర్తిగా విఫలమైందని, అధికారంలోకి వచ్చి దాదాపు ఏడున్నర నెలలైనా.. ఇంతవరకు పేదలు, బలహీన వర్గాలు, దళితులను పట్టించుకోలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వ తరహాలోనే బీజేపీ కూడా ప్రైవేటు రంగలో రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏమీ చేయలేదని, వెనకబడిన వర్గాల ప్రజలు అభివృద్ది చెందాలని వారు కోరుకోరని మాయావతి విమర్శించారు.