ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు
ఇద్దరు జవాన్లు, ఒక మావోయిస్టు మృతి
చర్ల/చింతూరు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు జవాన్లు చనిపోగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. సుకుమా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ సంయుక్త బలగాలు కూంబింగ్ పూర్తి చేసుకుని క్యాంపుకు తిరిగివస్తుండగా దుర్మా గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు మావోలు పోలీసులపై విరుచుకుపడ్డారు.
ఈ దాడిలో ఇద్దరు డీఆర్జీ జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. తొండమరక గ్రామ సమీపంలో కూంబింగ్కు బయలుదేరిన మరో బృందాన్ని గుర్తించిన మావోలు..మాటువేసి బలగాలు దగ్గరకు రాగానే కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఐదుగురు ఎస్టీఎఫ్ పోలీసులు గాయపడ్డారు. ఎదురుకాల్పులు జరిపేలోపే మావోయిస్టులు తప్పించుకున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పెషల్ డీజీపీ డీఎం అవస్థీ మీడియాతో మాట్లాడుతూ భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 12 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారని , మావోల మృతదేహాల్ని వారి సహచరులు తీసుకెళ్లిపోయారని ఒక మృతదేహం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.