బీహార్లో 20 మంది.. యూపీలో 8 మంది మృతి!
నేపాల్లో మొదలైన భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశం మీద కూడా తీవ్రంగానే కనిపించింది. బీహార్లో 20 మంది, ఉత్తరప్రదేశ్లో 8 మంది భూకంపం కారణంగా మరణించారు. బీహార్లోఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు గోడకూలి మరణించారు. ఉత్తర బీహార్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్ల గోడలకు బీటలు వారాయి. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ముగ్గురు మరణించారు. మాల్డాలోని ఓ స్కూలు భవనం కుప్పకూలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈశాన్య భారతంలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. ఈశాన్య రాష్ట్రాలలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. ఉత్తరాఖండ్ విలవిల్లాడింది. డెహ్రాడూన్లో ఉన్న పర్యాటకులు, కేదార్నాథ్ యాత్రికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 80 మంది భారతీయులు నేపాల్ వెళ్లారు. వీరిలో 20 మంది పర్వతారోహణ కోసం వెళ్లారు.
దక్షిణాదిన కూడా స్వల్ప భూకంపం వచ్చినా, ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టాలు మాత్రం సంభవించినట్లు వార్తలు రాలేదు. హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు నేపాల్లో చిక్కుకున్నారు. వెటకారం.కామ్ చిత్ర బృందం కూడా అక్కడ చిక్కుకుంది. కాగా, గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి వెళ్లిన వారు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. అలాగే హైదరాబాద్ నుంచి బయల్దేరిన 25 మంది కూడా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం వచ్చింది.