షర్మిలను విడుదల చేయండి: మణిపూర్ కోర్టు

షర్మిలను విడుదల చేయండి: మణిపూర్ కోర్టు


ఇంఫాల్: మణిపూర్‌లో సైనిక దళాలకు విశేష అధికారాలను కల్పిస్తున్న చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఐరోమ్ చాను షర్మిలను విడుదల చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. 14 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన తూర్పు ఇంఫాల్ సెషన్స్ జడ్జి గుణేశ్వర్ శర్మ మంగళవారం షర్మిలను కస్టడీనుంచి విడుదల చేయాలని తీర్పునిచ్చారు. ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్నారు. 42 ఏళ్ల షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్నారని, తమ సమస్యకు పరిష్కారం దొరికేంతవరకు భవిష్యత్తులో ఆమె పోరాటం కొనసాగించే అవకాశం ఉందన్నారు.



ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ముక్కు ద్వారా ఆహారం అందించి ఆమె ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చన్నారు. కోర్టు ఆదేశాలు అందినతర్వాత షర్మిలను విడుదల చేసే అవకాశాలున్నాయి. సైనికులకు ప్రత్యేక అధికారాలు తొలగించేంతవరకు షర్మిల తన పోరాటం కొనసాగిస్తారని ఆమె సోదరుడు ఇరోమ్ సింఘాజిత్ తెలిపారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రోగ్రామ్స్ డెరైక్టర్ శైలేష్‌రాయ్ సంతోషం వ్యక్తంచేశారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top