సెల్ఫీ తీసుకుంటున్న భార్యను తోసేశాడు

సెల్ఫీ తీసుకుంటున్న భార్యను తోసేశాడు - Sakshi


మీరట్: కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పైపెచ్చు భార్య కాల్వలో పడిపోయిందంటూ కల్లబొల్లి ఏడ్పులతో పోలీసులనే తప్పుదోవ పట్టించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగటంతో అతగాడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సోమవారం ఉత్తరప్రదేశ్  మీరట్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అఫ్తాబ్ (30) భార్య అయేషాతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఆమె గంగా కెనాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటోంది. అదును  చూసుకుని అఫ్తాబ్ ...భార్యను కాల్వలోకి తోసేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు సర్దానా పోలీస్ స్టేషన్లో తన భార్య ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయినట్లు ఫిర్యాదు చేశాడు.



ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అయేషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో అఫ్తబ్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడిని  అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో నేరాన్ని అంగీకరించాడు. అయేషాను అడ్డు తొలగించుకునేందుకే ఆమెను అంతం చేసినట్లు తెలిపాడు. అఫ్తాబ్, అయేషాలకు ఏడాదిన్నర క్రితమే వివాహం అయింది. వీరికి ఎనిమిది నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించి అఫ్తాబ్ తో పాటు అతని సోదరుడు షహ్నాజ్పై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top