ఐపీఎల్ బెట్టింగ్లో భార్యను ఓడిపోయాడు
కాన్పూర్: మహాభారతంలో ధర్మరాజు జూదంలో భార్య ద్రౌపదిని ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రబుద్ధుడు ఇలాగే ఐపీఎల్ బెట్టింగ్లో భార్యను ఓడిపోయాడు. పందెంలో ఆమెను గెలిచిన జూదరులు తమతో రావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. జూదరుల ఆగడాలు భరించలేక ఆ యువతి సామాజిక కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిందితుడు షేర్ మార్కెట్లో తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి 7 లక్షల రూపాయలు తీసుకురావాల్సిందిగా భార్యను సతాయించేవాడు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై అతను పందేలు కాసేవాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో భార్యను పెట్టి పందెం కాశాడు. అతను ఎంచుకున్న జట్టు ఓడిపోవడంతో భార్యను కోల్పోయాడు. పందెం గెలిచిన జూదరులు ఇంటికి రావడం, ఫోన్ చేసి అతని భార్యను వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.