అరెస్ట్ చేశారన్న అవమానంతో ఆత్మహత్య!
భువనేశ్వర్: దొంగతనం చేశాడేమోనన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తి 24 గంటలు గడువక ముందే శవమయ్యాడు. ఇందుకు కారణమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులు సస్పెండయ్యారు. ఈ ఘటన ఒడిషాలోని మయుర్భంజ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. దొంగతనం చేశాడేమోనన్న అనుమానంతో చందన్ దాస్(32)ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో ఉంచారు. అదే టౌన్ పోలీస్ స్టేషన్లో అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తన కొడుకును పోలీసులు కావాలనే స్టేషన్కు తీసుకొచ్చి హత్య చేశారని చందన్ దాస్ తల్లి ఆరోపించింది. కొడుకు మృతదేహంపై గాయపడిన గుర్తులు కూడా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొంది. శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండా స్టేషన్ ఎదుట బాధితుడి మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టగా ఏఎస్పీ గోవింద్ చంద్రా మల్లిక్ స్పందించారు. ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న ఏఎస్సై ఉమేష్ నాయక్, బిక్రమ్ లెంక, మహిళా కానిస్టేబుల్ దీప్తి బారిక్లను సస్పెండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి లక్ష రూపాయలను ఏఎస్పీ అందజేశారు.