శాంతించిన దీదీ, ఎట్టకేలకు ఇంటికి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు సచివాలయం నుంచి ఇంటికి వెళ్లారు. తమ రాష్ట్రంలోని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాల మొహరింపుకు నిరసనగా ఆమె 36 గంటల పాటు సచివాలయంలోనే ఉన్నారు. కేంద్రం తమకు సమాచారం ఇవ్వకుండా సైనిక బలగాలను దించినందుకు నిరసనగా ఆమె ఇంటికి వెళ్లకుండా సచివాలయంలోనే ఉండిపోయారు. కేంద్రం వెనక్కు తగ్గడంతో ఆమె శాంతించారు.
ఆర్మీ అంటే తనకెంతో గౌరవం ఉందని, రాజకీయ కక్ష సాధింపులకు సైన్యాన్ని వాడుకోవడం సరికాదని మమత అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మోదీ సర్కారు దెబ్బ తీస్తోందని విమర్శించారు. తమను అణచివేసేందుకు కేంద్రం చూస్తోందని, మోదీ ప్రభుత్వంపై న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.