నిమజ్జన వివాదం: సుప్రీంకు మమతా సర్కార్..?
సాక్షి,కోల్కతాః మొహరం సందర్భంగా అక్టోబర్ 1న దుర్గా మాత విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలను అక్టోబర్ 1న నిషేధిస్తూ మమతా సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.మొహరం, విజయదశమి ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. మొహరం ఊరేగింపు, దుర్గా విగ్రహాల నిమజ్జనం రెండూ నిర్వహించాలని, వీటికి సంబంధించిన రూట్ మ్యాప్ను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే హైకోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్ధానంలో సవాల్ చేయాలని మమతా సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం కోర్టు ఉత్తర్వులపై సీఎం మమతా బెనర్జీ సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఏం చేయాలో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీం ఏ క్షణమైనా ప్రభుత్వం తరపున హైకోర్టు ఆదేశాలపై పిటిషన్ దాఖలు చేయవచ్చని తెలిసింది.