మూడేళ్ల చిన్నారిని చితకబాదేసిన ట్యూటర్
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో కూడా 'కాకినాడ' తరహా సంఘటన ఒకటి జరిగింది. నిండా మూడున్నరేళ్లు కూడా లేని పిల్లాడిని పట్టుకుని, కొద్ది రోజుల క్రితమే ఇంట్లో ట్యూషన్కు పెట్టుకున్న పూజా సింగ్ అనే మహిళ చేత్తోనే చితకబాదేసింది. గది లోపలవైపు గడియ పెట్టుకుని మరీ పిల్లాడిని చితక్కొట్టేసింది. ఆమె ఎందుకలా చేసిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. తన మాట వినట్లేదన్న కోపంతో పిల్లాడిని ఏకంగా తిరగేసి పట్టుకుని, మంచంమీదకు విసిరేసిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. పిల్లాడు వద్దు వద్దని బతిమాలుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు.
పిల్లాడు గుక్కపట్టి గట్టిగా ఏడుస్తుండటంతో అనుమానం వచ్చిన తల్లి వెంటనే ఆ గదిలో ఉన్న సీసీటీవీ కెమెరా ఆన్ చేసి, బయటినుంచి చూసేసరికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆమె తలుపులు గట్టిగా కొట్టి, పూజా సింగ్ను గట్టిగా నిలదీయగా, ఆమె పోలీసులకు మాత్రం చెప్పొద్దని బతిమాలి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ ఆమె భర్త వచ్చి, పోలీసులకు చెబితే మీ అంతు చూస్తానంటూ బెదిరించడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పూజాసింగ్ పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని లేక్ టౌన్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అశోక్ సేన్ తెలిపారు.
సంబంధిత వార్తలు