హర్యానా ప్రభుత్వంపై కేజ్రీవాల్ విసుర్లు
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో దేశ రాజధానికి వెళ్లే మార్గంలో గుర్గావ్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో హర్యానా ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పనితనానికి ఈ పరిణామం అద్దం పడుతోందని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. గుర్గావ్లో ట్రాఫిక్ స్తంభించడంతో తన స్నేహితుడు గురువారం నుంచి ఇంటికి వెళ్లకుండా ఆఫీస్ లోనే నిద్రపోతున్నానని ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్పై కేజ్రీవాల్ స్పందించారు. 'బీజేపీ పాలన అంటే ఇలాగే ఉంటుంద'ని వ్యాఖ్యానించారు.
మాటలు కటిపెట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని సిసోడియా అన్నారు. మిలినీయం సిటీగా పేరు గాంచిన గుర్గావ్ ను అభివృద్ధి చేశామని చెబుతున్న బీజేపీ పాలకుల మాటలు నీటి మూటలని తేలిందని ఎద్దేవా చేశారు. భారీ వర్షాల కారణంగా గుర్గావ్ నుంచి ఢిల్లీ వెళ్లే 8వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
Thats BJP's governance https://t.co/GDCyrWLxGZ
— Arvind Kejriwal (@ArvindKejriwal) 29 July 2016