'కలాం పదవిని వదిలేయాలనుకున్నారు'

'కలాం పదవిని వదిలేయాలనుకున్నారు' - Sakshi


భువనేశ్వర్: బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని2005లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత నాడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తన పదవిని వదులుకోవాలని భావించారని, ఆ రోజు ఆయన చాలా మదన పడ్డారని నాటి కలాం ప్రెస్ సెక్రటరీ ఎస్ఎం ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎన్ఐ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 'మై డేస్ విత్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవెర్' అనే టాపిక్పై ఆదివారం శిక్ష్యా ఓ అన్సందన్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఈ అంశాన్ని గుర్తు చేశారు.



2005లో బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని దానిని రాష్ట్రపతికి పంపించిందని, ఆ సమయంలో దానిని వెనక్కి పంపే అధికారం రాష్ట్రపతిగా కలాంకు ఉందని, అయితే, అలా పంపిన తర్వాత మరోసారి అదే తీర్మానం రాష్ట్రపతి వద్దకు వస్తే తిరిగి పంపించే అధికారం ఆయనకు లేనందున అయిష్టంగానే కలాం సంతకం చేశారని, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆ సమయంలో కలాం రామేశ్వరం వెళ్లి తన సోదరుడిని కూడా కలిసి ఈ విషయం మాట్లాడారని, తన పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఎస్ఎం ఖాన్ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top