రియాలిటీ షోలే బెటర్

రియాలిటీ షోలే బెటర్


న్యూఢిల్లీ: రియాలిటీ షోలు చేస్తేనే మజా అనిపిస్తుందని బాలీవుడ్ సీనియర్ నటి జూహి చావ్లా చెప్పింది. రియాలిటీ షోలలో తమను తాము ఆవిష్కరించుకునేందుకు సినీ తారలకు ఎక్కువ అవకాశముంటుందని ఆమె అభిప్రాయపడింది. నిజానికి సినిమా రంగం నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది  కాల్పనిక కథల్లో  నటించలేరు..’ అని ఆమె అంది.‘ నా వరకు నేను రియాలిటీ షోలో నటించేందుకే ఇష్టపడతాను. కాల్పనిక కథలో అయితే ఒక కథలో పాత్రగా మాత్రమే కనిపిస్తాం.. అదే రియాలిటీలో కొత్తగా కనిపించేందుకు అవకాశముంటుంద’ని పేర్కొంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న మెగా టీవీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కొత్త సిరీస్‌లో ఆమె కూడా కనిపించనుంది.



 ఇదిలా ఉండగా, జూహిచావ్లా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’, ‘ఐనా’, ‘హమ్‌హై రాహి ప్యార్ కే’, ‘డర్’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాక టీవీలో వచ్చినరియాలిటీ షో ‘జలక్ ధిక్లా జా 3’ కి జడ్జిగా వ్యవహరించింది. అలాగే గతంలో చిన్న పిల్లలతో నిర్వహించిన టీవీ రియాలిటీ షో ‘బద్మాష్ కంపెనీ’కి వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరించింది. అలాగే కొత్తగా వచ్చిన హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ ‘సోనీ పాల్’లో కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ అవును.. నేను సోనీ పాల్ చానల్‌తో పాటు పనిచేస్తున్నా.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడాన్ని నేను ఆస్వాదిస్తా.. వారిని నా నటనతో నవ్వించగలను.. ఏడిపించగలను..  అనే నమ్మకం నాకుంది.. అది ఎటువంటి షో అయినా సరే....’ అని ఆమె పేర్కొంది.



 ఇదిలా ఉండగా ఈ సినీ తారకు ఒక టీవీ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అయితే తన సోదరుడు అకాల మృతితో ఆ అవకాశాన్ని తాను అంగీకరించలేదని జూహీ చెప్పింది. ఒక ప్రేక్షకురాలిగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ తన కెంతో ఇష్టమైన కార్యక్రమమని జూహీ తెలిపింది. అలాగే డ్యాన్స్ షోలు, మ్యూజిక్ ఆధారిత షోలు చూడటానికి ఇష్టపడతానని వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top