భివండీలో మైనర్ బాలిక హత్య


భివండీ, న్యూస్‌లైన్: భివండీ పట్టణంలో బుధవారం ఒక యువతి హత్యకు గురైంది. ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న వ్యక్తే ఆమెను హత్య చేశాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి...భివండీ పట్టణంలోని కామత్‌ఘర్ ప్రాంతంలో వికాస్ చౌదరి చౌల్‌కు చెందిన గీతా భిలాయి పాస్‌వాన్ (17), తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. బంధువులకు అనారోగ్యంగా ఉండటంతో చూడటానికి ఇటీవల తల్లిదండ్రులు బీహార్ వెళ్లారు. అప్పటి నుంచి గీత తన సోదరి ఇంట్లో ఉంటోంది.



బుధవారం తెల్లవారుఝామున సుమారు 3.30 గంటలకు గీత అక్క ఇంటి తలుపులు ఎవరో గట్టిగా కొట్టారు. దీంతో గీత సోదరి తలుపు తెరిచింది. దుండగులు గీతను ఇంట్లో నుంచి బైటకు లాగారు. ఆమె అక్కను ఇంట్లోకే నెట్టేసి బయటనుంచి తలుపు గడియ పెట్టేశారు. అనంతరం గీత మెడను కత్తితో కోసేసి పారిపోయారు. ఉదయం 5 గంటలకు మంచి నీరును తీసుకురావడానికి వచ్చిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలి ఇంటిలోపలి నుంచి అరుపులు వినిపిస్తుండటంతో తలుపు తెరిచారు.



బయటకు వచ్చిన గీత అక్క, అక్కడ మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. ఈ విషయాన్ని స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. కాగా, గీత నాలుగు నెలల నుంచి వళ్ గ్రామంలోని గోదాములో విధులు నిర్వహిస్తోంది. అక్కడ ధీరజ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధిస్తూ, రోజూ వస్తూ పోతూ మాట్లాడడానికి ప్రయత్నిస్తుండేవాడని తేలింది. పోలీసులు ధీరజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో దర్యాప్తు జరపగా తనే ఆమెను హత్య చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top