భవిష్యత్తులో నెట్లోనే ఓటింగ్!
సమీప భవిష్యత్తులో మీరు ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రం వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లేదా ఆఫీసులో ఇంటర్నెట్ ముందు కూర్చుని మీ ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకుని వాళ్లకు వేసేయవచ్చు. ఈ విషయాన్ని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ శుక్రవారం వెల్లడించారు. ముందుగా ఎన్నికల జాబితాలన్నింటినీ తప్పులు లేకుండా తయారుచేసి, తర్వాతి దశలో ఇంటర్నెట్ ఓటింగ్కు వెళ్తామని ఆయన అన్నారు. అయితే.. ఇందుకు ఎంత కాలం పడుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.
ఇందుకు నిధులు, మౌలిక సదుపాయాలతో పాటు కొంత శిక్షణ కూడా అవసరమేనని, భారతదేశం దాన్ని చేసి తీరుతుందని చెప్పారు. ఇంటర్నెట్ ఓటింగ్ వల్ల బోలెడంత సమయం, వనరులు, శక్తి ఆదా అవుతాయని యువ ఓటర్లు భావిస్తున్నట్లు బ్రహ్మ తెలిపారు. తాను ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్నపుడు కొందరు యువకులు.. ఓటు వేయడం రెండు సెకన్ల పనే గానీ, క్యూలో అంతసేపు నిల్చోవడం కష్టమని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.