పాక్ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టాలి
భారత్లో ఉంటూ పాకిస్తాన్ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టాలని విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి బాలికా సరస్వతీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడేవారిని అక్కడికే తరిమికొట్టాలని, ఏమాత్రం సహించకూడదని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తామే చర్యలు తీసుకోవచ్చా అనే దిశగా ఆలోచన చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ప్రత్యేకంగా ఫిర్యాదేమి అందలేదని చెప్పారు. మధ్యప్రదేశ్కు చెందిన సాద్వి బాలిక సరస్వతీ ఈ నెల 1న మంగళూరులో హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో ముఖ్యవక్తగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ పరాయి దేశం పాక్ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టి తరిమేయాలన్నారు. ఇలాంటివాటిని సహిచంబోమని, దెబ్బకు దెబ్బకు తీయాల్సిందేనని చెప్పారు.
అయోధ్యలో రామమందిరం నిర్మించాలని, ఇస్లామాబాద్లో ఒక రామమందిరం నిర్మించాలని, అక్కడికి కూడా వెళ్లి మనమంతా పూజలు నిర్వహించాలంటూ వ్యాఖ్యానించారు. భారత్ స్వాతంత్ర్యాన్ని శాంతియుతంగా పొందిందని చరిత్ర చెప్పొచ్చుగానీ, మీ స్వాతంత్ర్యం మాత్రం శాంతియుతంగా లేదంటూ పాక్ను ఉద్దేశించి అన్నారు. మనందరం ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం వచ్చిందని సభనుద్దేశించి మాట్లాడారు.
సంబంధిత వార్తలు