భారత యువతికి ‘గ్రీన్ ఆస్కార్’


కోల్‌కతా: వన్యప్రాణులు, జంతువులకు సంబంధించిన ఉత్తమ చలన చిత్రాలకు ఇచ్చే ‘వైల్డ్ స్క్రీన్ పండా అవార్డ్’ను పశ్చిమబెంగాల్‌కు చెందిన యువ ఫిల్మ్ మేకర్ అశ్వికా కపూర్ సాధించారు. ఈ అవార్డును ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌తో పోలుస్తూ.. ‘గ్రీన్ ఆస్కార్’గా పరిగణిస్తారు. ‘కకాపో చిలుక (గుడ్లగూబ చిలుక)’ జీవితం ఆధారంగా అశ్విక నిర్మించిన ‘సిరొక్కో’ లఘు చిత్రానికి ఈ అవార్డు వచ్చింది. బ్రిటన్‌లోని బ్రిస్టల్ సిటీలో జరుగుతున్న వైల్డ్ స్క్రీన్ ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. కోల్‌కతాలో కాలేజీ చదువు పూర్తిచేసిన 26 ఏళ్ల అశ్విక..



న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయం నుంచి ‘శాస్త్ర, జీవావరణ చరిత్ర చలన చిత్ర నిర్మాణం’లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన, ఎగరలేని జాతి అయిన ‘కకాపో చిలుక’పై 15 నిమిషాల చిత్రాన్ని రూపొందించారు. దీనిని వైల్డ్ స్క్రీన్ ఫెస్టివల్‌కు పంపగా... 42 దేశాలకు చెందిన 488 చిత్రాలతో పోటీ పడి మరీ ‘గ్రీన్ ఆస్కార్’ను గెలుచుకుంది.  

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top