‘బీజేపీకి మా రాష్ట్రంలో 80, దేశంలో 400 సీట్లు’
లక్నో: ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో అరాచకత్వం రాజ్యమేలిందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు 15 ఏళ్లు వికాసానికి దూరమయ్యారని చెప్పారు. ఆయన పరిపాలన వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ మీడియా చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు ఆయన చేసిన పనులు చేయాలనుకుంటున్నవి వివరించారు. తాము అధికారంలోకి రాగానే బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం రోమియో స్క్వాడ్స్ టీంలను ప్రవేశపెట్టామని చెప్పారు. అక్రమ కబేళాలు మూయించాలని తాను కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ను కోరినట్లు తెలిపారు.
ఇతర రాష్ట్రాలు కూడా అక్రమ కబేళాలను మూయించడం తనకు ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని భాషలను ఉత్తరప్రదేశ్ స్కూళ్లలో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తాము మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నామని, దీంతో యూపీ విద్యార్థులు మరాఠీ, అలాగే అక్కడి వారు హిందీ నేర్చుకునే వీలుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నింటిని తాము యూపీలో అమలుచేస్తామని చెప్పిన ఆయన ఎవరేమనుకున్నా 2019లో ఒక్క అభివృద్ధి మాత్రమే అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆ అభివృద్ధి పేరే ఎన్డీయే అని, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు గెలుచుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక మహిళల స్వయం సమృద్ధి గురించి మాట్లాడానికి ముందు ట్రిపుల్ తలాక్ వ్యవస్థను ఆపేయాలని, తలాక్ వ్యతిరేకంగా తమ గొంతు వినిపించిన ముస్లిం వ్యక్తులందరకి తన ధన్యవాదాలని చెప్పారు. బాబర్, ఔరంగజేబులు భారతీయ ముస్లింలకు పూర్వీకులు కాదని తెలిపారు. తన గతం గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోనని, ప్రజలకోసమే పనిచేస్తానని అన్నారు. రామాలయం గురించి తనతో చాలామంది ముస్లిలు మాట్లాడారని చెప్పిన యోగి.. గోసంరక్షకులు ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.