యుద్ధం వస్తే 10రోజుల కన్నా పోరాడలేం: కాగ్‌

యుద్ధం వస్తే 10రోజుల కన్నా పోరాడలేం: కాగ్‌ - Sakshi


న్యూఢిల్లీ: భారత్‌ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తన రిపోర్టులో పేర్కొంది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)కి సంబంధించిన వివరాలను శుక్రవారం పార్లమెంట్‌లో కాగ్‌ ప్రవేశపెట్టింది.



దేశ రక్షణకు ఎంతో అవసరమైన యుద్ధ సామగ్రిని పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుకోలేకపోతున్నామని చెప్పింది. 2013 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకూ మన వద్ద ఉన్న యుద్ధ సామగ్రి నిల్వల్లో పెద్ద మార్పులేవి లేవని తెలిపింది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే అత్యవసరమయ్యే 55 శాతం సామగ్రి అందుబాటులో లేదని చెప్పింది.



అందుబాటులో ఉన్న 40 శాతం యుద్ధ సామగ్రి కూడా పది రోజుల పాటు యుద్ధం జరిగితే అయిపోతుందని తెలిపింది. ముఖ్యంగా ఆర్టిలరీ గన్స్‌, ట్యాంక్‌లకు అవసరమయ్యే యుద్ధ సామగ్రి కొరత తీవ్రంగా ఉందని చెప్పింది. 2013లో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఓఎఫ్‌బీ విఫలమైందని విమర్శించింది.



పేలుళ్లు, మిస్సైల్స్‌లలో ఉపయోగించే ఫ్యూజ్‌ల కొరత ఎక్కువగా ఉందని ఆర్టిలరీ మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వీకే చతుర్వేది ఓ జాతీయ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. ఫ్యూజ్‌లు లేకపోవడం వల్ల యుద్ధంలో మిస్సైల్స్‌, మోర్టార్స్‌, ఆర్టిలరీ ఎక్స్‌ప్లోజివ్స్‌లను వినియోగించలేమని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top