భారత్లో ‘పట్టణ’ విప్లవం!
2031కి 60 కోట్ల జనాభా పట్టణాల్లోనే..
ఐక్యరాజ్యసమితి: రోజురోజుకూ జనాభా వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భారతదేశం ప్రస్తుతం పట్టణీకరణ విప్లవం అంచున ఉందని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. భారత్లో 2031 నాటికి 60 కోట్ల మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తారని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన ‘ఆర్థికవ్యవస్థ, వాతావరణంపై ప్రపంచ కమిషన్’ మంగళవారం ఈ మేరకు ‘న్యూ క్లైమేట్ ఎకానమీ రిపోర్ట్’ను విడుదల చేసింది.
రాబోయే 20 ఏళ్లలో భారత్లో పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏకంగా 82,700 కోట్ల డాలర్ల (రూ.50 లక్షల కోట్లు) మేరకు పెట్టుబడులు అవసరమవుతాయని, అందువల్ల నిధుల లోటు భారీగా ఉంటుందని కమిషన్ పేర్కొంది. వీటిలో అత్యధిక నిధులు నగరాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణకే అవసరమవుతాయని తెలిపింది. బ్రెజిల్, చైనా, భారత్, బ్రిటన్, అమెరికాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఏడాదిపాటు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ప్రపంచ సుసంపన్నత, సురక్షిత వాతావరణం కోసం పది అంశాలతో ‘ప్రపంచ కార్యాచరణ ప్రణాళిక’ను సూచించింది.