భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్‌

భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్‌ - Sakshi


తొలి శస్త్రచికిత్స విజయవంతం

గుర్గావ్‌:
3డీ సాంకేతికతతో ప్రింట్‌ చేసిన శరీర భాగాలు త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. వైద్య రంగంలో ఇది పెను మార్పులను తీసుకురానుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సాంకేతికతతో ఒక శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక టీచర్‌కు వెన్నెముకలోని మూడు వెన్నుపూసలు పాడవగా, 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతను ఉపయోగించి టైటానియం ఇంప్లాంట్‌లను రూపొందించి ఆమె వెన్నెముకలో వైద్యులు అమర్చగలిగారు.


ఈ నెల మొదట్లో నోయిడాలోని మెడ్‌సిటీలో ఈ శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ చేసిన నాలుగు రోజులకే ఆమె నడవగలిగిందనీ, సాధారణ పద్ధతిలో అయితే ఆమె కాలి నుంచి ఎముకను సేకరించి వెన్నెముకలో అమర్చాల్సి రావడంతోపాటు ఆరు నెలలపాటు ఆమె మంచానికే పరిమితం కావాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. ఈ తరహా శస్త్రచికిత్స భారత్‌లో మొదటిదనీ, ప్రపంచంలో మూడవదని సర్జరీ చేసిన వైద్యులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top