''వాళ్లు ఒకళ్లను చంపితే మేం...''
బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారని చెబుతున్న వీడియో ఒకటి రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మతఘర్షణలపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున చర్చను ప్రారంభించిన ఆయన చేశారంటున్న వ్యాఖ్యలు ఇంటర్నెట్లో కలకలం సృష్టిస్తున్నాయి. అయితే.. అది తాను నేరుగా మాట్లాడినది కాదని, ఎక్కడెక్కడో వేర్వేరు సందర్భాలలో మాట్లాడిన విడివిడి మాటలను కట్ చేసి, వీడియోలో పేస్ట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
గోరఖ్పూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడినట్లు ఈ వీడియోలో ఉంది. అందులో ఆయన ''వాళ్లు ఒక హిందువును ముస్లింలోకి మారిస్తే మేం వందమంది ముస్లిం అమ్మాయిలను హిందువులుగా మారుస్తాం'' అని అంటారు. అంతేకాదు, ''వాళ్లు ఒక హిందువును చంపితే మేం..'' అని ఆగిపోతారు. వెంటనే అక్కడ సభలో ఉన్న వాళ్లంతా కలిసి 'వంద' అని అరుస్తారు. అయితే ఇదంతా కేవలం తనమీద బురద చల్లడానికి కొంతమంది చేస్తున్నప్రయత్నమేనని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి మంత్రాన్నే పఠిస్తుంది తప్ప ఇలా ఎప్పుడూ చెప్పదని ఆయన తెలిపారు.