మోడీని తక్కువగా అంచనా వేశా!
నరేంద్ర మోడీ.. సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించి.. దేశానికే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశారు, ఘటనా ఘటన సమర్థులను ఎదుర్కొన్నారు. ఢక్కామొక్కీలు తిని బాగా రాటుదేలారు. అందుకే పాత్రికేయులకు ఆయన్ను ఇంటర్వ్యూ చేయడం అంటే అంత సులభం కాదు. ఇదే విషయాన్ని సీఎన్ఎన్ వరల్డ్ ప్రతినిధి ఒకరు తాజాగా చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీని తాను తక్కువగా అంచనా వేశానని, కానీ ఇప్పటివరకు తాను చూసిన నాయకులందరిలో ఆయనే చాలా షార్ప్ అని ఫరీద్ జకారియా అనే ఆ పాత్రికేయుడు చెప్పారు. ఆయన చాలా తెలివైనవారని, అన్ని విషయాలపై దృష్టి బాగా కేంద్రీకరిస్తారని, ఆయనకు దీర్ఘకాలిక ఎజెండా ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి రాజనీతిజ్ఞుడిగా పేరుతెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యమని, గతంలోకి చూసి బాధపడేకంటే భవిష్యత్తులోకి చూసి సాధించడం ఆయనవద్దే నేర్చుకోవాలని జకారియా అన్నారు.
భారతీయ ముస్లింలు భారతదేశం కోసమే జీవిస్తారు, దేశం కోసమే మరణిస్తారని.. అల్ కాయిదా లాంటి సంస్థలు వీళ్లను ఎంత మభ్యపెట్టాలనుకున్నా సాధ్యం కాదని ఆ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ తెలిపారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే. ముస్లింలు ఒక చేత్తో ఖురాన్, మరో చేత్తో కంప్యూటర్ పట్టుకుని వెళ్లాలని మోడీ చెబుతారని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ అన్నారు.