ప్రియుడి కోసం భర్త హత్య


సాక్షి, ముంబై: ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య గుట్టు రట్టయ్యింది. భర్త తండ్రి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. సమద్‌నగర్ ప్రాంతానికి చెందిన రంజాన్ మోమిన్ (24) వారం రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడని భార్య అజరున్నీసా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతిమ క్రియలకు కూడా అన్ని సిద్ధం చేసుకొంది. కానీ ఈ సంఘటనపై మృతుడి తండ్రికి అనుమానం వచ్చింది.



కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారాలు చేపట్టగా ఢొంక కదిలింది. అసలు దోషులు బయట పడ్డారు. గతంలో అజరున్నీసా- కలీమ్ మోమిన్ ప్రేమించుకొన్నారు. వారి కుటుంబీకులు వివాహానికి నిరాకరించారు. ఆమెకు రంజాన్ మోమిన్‌తో వివాహం జరిపించారు. అయినప్పటికీ వీరి వివాహేతర సం బంధం కొనసాగుతోంది. ఒక రోజు ఈ విషయం భర్త దృష్టికి రావడంతో వీరి మధ్య గొడవ జరిగింది.



 దీనిని దృష్టిలో పెట్టుకొన్న అజరున్నీసా- కలీమ్‌లు కలిసి పథకం పన్నారు. ఇందుకోసం రూ. 1.5 లక్షలతో కొందరితో ఒప్పందం కుదుర్చుకొన్నారు. దీని ప్రకారం తన ఇంట్లోనే రంజాన్‌ను చితక బాది గొంతు నులిమి హత్య చేశామని పోలీసుల సమక్షంలో ఆమె అంగీకరించింది. అజిరున్నీసా, కలీమ్‌తోపాటు, వీరికి సహకరించిన ఫిరోజ్ అన్సారీ, అయూబ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని కోర్టులో హాజరు పర్చారు. ఏడు రోజులు పోలీస్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top