'వెనక్కి తగ్గం.. సలహాలు తీసుకుంటాం'
భూసేకరణ ఆర్డినెన్స్పై వెంకయ్య స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ సహా ఏ ఆర్డినెన్స్ విషయంలోనూ వెనక్కుతగ్గే ప్రశ్నే లేదని కేంద్రం స్పష్టంచేసింది. అయితే బడ్జెట్ సమర్పణ తర్వాత సంబంధిత బిల్లులు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు విపక్షాలు ఇచ్చే సూచనలు, సలహాలను స్వీకరిస్తామని గురువారం పేర్కొంది. ఈ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఈ ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లుల విషయంలో ఎలాంటి ఆటంకాలనైనా అధిగమిస్తామని, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వం ముందుకే వెళుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఏ ఆర్డినెన్స్ విషయంలోనూ వెనక్కుపోయేది లేదని అన్నారు. సంబంధిత బిల్లులపై పార్లమెంటు లో పూర్తిస్థాయి చర్చ జరగాలని కోరుకుంటున్నామని మీడియాతో అన్నారు. ఈ బిల్లుల విషయంలో మిత్రపక్షాలు, తమకు మద్దతు ఇస్తున్న పార్టీలతో మాట్లాడుతున్నామన్నారు. భూసేకరణ బిల్లుపై మరో మిత్రపక్షం అప్నాదళ్ గురువారం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. రైతుల ప్రయోజనార్థం సలహాలను తీసుకునేందుకు సిద్ధమని కేంద్రం తెలిపింది.
యూపీఏ చట్టం దేశ భద్రతకు ముప్పు..
గత యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూ చట్టం లోపభూయిష్టమని, దాని వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ చట్టంలో లోపాల వల్ల దేశంలోని కీలకమైన రక్షణ రంగ ప్రాజెక్టుల సమాచారం సైతం పాకిస్తాన్ పొందగలదని, దాని వల్ల జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందన్నారు. అందుకే, చట్టంలోని లోపాలను తక్షణం సవరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గురువారం రాజ్యసభలో తెలిపారు.
వెంకయ్య వ్యాఖ్యలపై విపక్షాల ధ్వజం
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై గురువారం విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వెంకయ్య తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళన కారణంగా సభ కొద్దిసేపు స్తంభించింది. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ సందర్భంగా ఆత్మపరిశీలనకోసం రాహుల్ గాంధీ సెలవు తీసుకున్నారన్న అంశంపై మాట్లాడు తూ, కాంగ్రెస్ కూడా ఆ పనిచేస్తే బాగుం టుందని వెంకయ్య విమర్శించారు. దీనిపై మండిపడ్డ విపక్షాలు సభనుంచి వాకౌట్ చేశా యి. గురువారం కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. విపక్షాల నిరసనను గమనిం చిన వెంకయ్య సుమోటోగా ప్రకటన చేశారు. ప్రతిపక్షాలను, విపక్ష నేతలను తాను గౌరవిస్తానని అన్నారు.
సంబంధిత వార్తలు