వెనక్కు తగ్గేదేలేదు!


ప్రభుత్వానికి మహిళా గోవింద బృందాల సవాల్



సాక్షి, ముంబై: ఆరేళ్ల పిల్లలతో ఉట్టి ఉత్సవాల్లో పాల్గొంటామని, ఎలాంటి చర్యలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని  మహిళ గోవిందా బృందాలు ప్రభుత్వానికి సవాలు విసిరాయి. దీంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. పిల్లలను అనుమతించకపోతే ఈ ఏడు ఉట్టి ఉత్సవాలను నిర్వహించలేమని ఇప్పటికే పురుష గోవింద బృందాలు హెచ్చరించిన విషయం తెలిసిందే.  

 

వీరికి మహిళ గోవిందా బృందాలు కూడా తోడుకావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొనడంపై బాలల హక్కుల సంఘం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ పార్లే స్పోర్ట్స్ క్లబ్, స్వాస్తిక్ మహిళ గోవిందా మండలి బృందాలు పిల్లలతోనే మానవ పిరమిడ్‌లు నిర్మిస్తామని సవాలు విసిరాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మంత్రాలయలో వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్, బాలల హక్కుల సంరక్షణ  కమిషన్ కార్యదర్శి ఎ.ఎన్.త్రిపాఠి, దహి హండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పడేల్కర్, వివిధ మండళ్ల పదాధికారులు సమావేశమయ్యారు.

 

కాని అది ఎటూ తేలకుండానే ముగిసింది. కాగా పిల్లలకు అనుమతివ్వని పక్షంలో నగరంలో ఈసారి ఉట్టి ఉత్సవాలను పూర్తిగా బహిష్కరిస్తామని పడేల్కర్ హెచ్చరించిన విషయం విదితమే. కాని మహిళ గోవిందా బృందాలు ఎలాంటి చర్యలకైన సిద్ధమేనని, పిల్లలతో ఉట్టి ఉత్సవాల్లో పాల్గొంటామని మండలి ప్రతినిధులు గీతా జగడే, ఆరతి బారీ ప్రకటించారు. ఈ సమస్యపై మరోసారి సమావేశం నిర్వహించి పరిష్కార మార్గం కనుగొంటామని జితేంద్ర అవ్హాడ్ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top