ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..

ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు.. - Sakshi


బెంగళూరు : బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలోని కాడ్‌గోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఇంటర్ విద్యార్థినిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల  సంఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే ప్రగతి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న గౌతమి అదే కాలేజీ హాస్టల్లో ఉంటోంది.  కాగా అదే కళాశాలలో ఆఫీస్ బాయి్ గా పని చేస్తున్న మహేష్ గత కొంతకాలంగా గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమె నిరాకరించటంతో అతడు కక్ష గట్టాడు.



గత రాత్రి 11.30 గంటల సమయంలో మహేష్ ...హాస్టల్కు వెళ్లి గౌతమితో ప్రేమ విషయంలో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఆమె నిరాకరించటంతో కోపం పట్టలేని అతడు సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉండే గన్తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో గౌతమి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థిని శిరీష గాయపడింది. శిరీషను చికిత్స నిమిత్తం వైదేహీ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలు గౌతమి స్వస్థలం అనంతపురం జిల్లా పావుగడ. ఆమె కుటుంబ సభ్యులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇచ్చింది. మరోవైపు శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక హోం మంత్రి కేజే జార్జ్, సిటీ పోలీస్ చీఫ్ ఎంఎన్ రెడ్డి, సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top