తల్లిదండ్రులముందే బాలిక కాల్చివేత
చిరాంగ్ జిల్లా (అస్సాం): అస్సాంలోని బోడోలాండ్ తీవ్రవాదులు తెగబడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను ఇంట్లోనుంచి బయటకు లాగి, దారుణంగా కొట్టి, తల్లిదండ్రుల కళ్లముందే, పాయింట్బ్లాంక్ రేంజ్లో తొమ్మిదిసార్లు కాల్చి చంపారు. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. తీవ్రవాదులు చిరాంగ్ జిల్లాలోని ద్విముగ్రి గ్రామంలోకి ప్రవేశించి ప్రియ బసుమతారే అనే బాలికను ఇంటినుంచి బయటకు లాగారు. తల్లిదండ్రులను కళ్లుకూడా పక్కకు తిప్పుకోవద్దంటూ భయపెట్టి ఆ బాలిక శరీరంలోకి తొమ్మిది తూటాలు దింపారు. రెండు రోజులపాటు ప్రియ శరీరం అలాగే బయటే పడిఉంది. అంతకు ముందురోజు పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. పోలీసులకు ప్రియనే సమాచారం అందించిందన్న అనుమానంతో తీవ్రవాదులు ఆమెను చంపారని తెలుస్తోంది.