రైతు పథకానికి గజేంద్ర పేరు


గజేంద్ర కుటుంబ డిమాండ్లకు ఆప్ సర్కారు అంగీకారం

న్యూఢిల్లీ/జైపూర్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ర్యాలీలో ఉరేసుకొని మరణించిన రైతు గజేంద్ర సింగ్ కుటుంబం డిమాండ్లకు ఆ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గజేంద్ర సింగ్‌కు అమర వీరుడి హోదా కల్పించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సర్కారు ఒప్పుకుంది. వీటితోపాటు కరువు ప్రాంతాల్లో రైతులకిచ్చే పరిహార పథకానికి గజేంద్ర సింగ్ పేరును పెట్టాలని నిర్ణయించింది.



పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ శుక్రవారం రైతు కుటుంబసభ్యులను కలసి రూ.10 లక్షల పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గజేంద్రసింగ్ కుటుంబం చేసిన డిమాండ్లను ఆయన శనివారం సీఎం కేజ్రీవాల్ దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత కేజ్రీవాల్ గజేంద్ర సోదరుడితో మాట్లాడి వారి డిమాండ్లకు అంగీకారం చెప్పారని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉండగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాజస్తాన్ దౌసా జిల్లాలోని గజేంద్ర సింగ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top