ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన గడ్కరీ!


ఆయన స్వయానా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి. కానీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. అవును.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లేటప్పుడు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్లి, కెమెరాలకు దొరికేశారు. నాగ్పూర్ నుంచే ఎంపీగా ఎన్నికైన గడ్కరీ (58) తెల్ల రంగు స్కూటర్ వేసుకుని, వెనకాల సెక్యూరిటీ అధికారిని కూడా పెట్టుకుని.. మాహల్ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న మోహన్ భాగ్వత్ను కలవడానికి వెళ్లారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన వెళ్లారు. అయితే, హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపి.. నిబంధనలను ఉల్లంఘించారేమని పలువురు పాత్రికేయులు ఆయన్ను అడిగారు. దానిపై వ్యాఖ్యానించేందుకు గడ్కరీ తిరస్కరించారు.



ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఇది ఆ నాయకుడి, పార్టీ ప్రవర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు. వేరే ఎవరైనా అయితే అది చిన్న విషయం కావచ్చు గానీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి ఇలా చేయడం ఏంటని నిలదీశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇంకా ఆయన మంత్రి కాక ముందు కూడా ఇలాగే హెల్మెట్ లేకుండా స్కూటర్ నడిపి పట్టుబడ్డారని ఓ టీవీ ఛానల్ వ్యాఖ్యానించింది. నాగ్పూర్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్లో చూస్తే.. ఇలా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వాళ్లకు వంద రూపాయల జరిమానా విధిస్తారు!!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top