బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ ధీర్

బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ ధీర్ - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ :  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై జంగ్‌పురా  నియోజకవర్గం నుంచి ఎన్నికైన మణిందర్ సింగ్ ధీర్ బీజేపీలో  చేరారు. ఇటీవల రద్దయిన అసెంబ్లీకి ఆయన స్పీకర్‌గా ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంశల్లో ముంచెత్తారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. ఎట్టకేలకు తెరపడింది. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో  ఆ పార్టీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ సమక్షంలో ధీర్ బీజేపీలో చేరారు. పార్టీ ఇన్‌చార్జ్ ప్రభాత్ షా ఆయనకు శాలువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 

ప్రజల మనోభావాలను దెబ్బతీశారు : ధీర్

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధీర్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. అవకాశం లభిస్తే కేజ్రీవాల్ మరోసారి ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చని  ఆయన వ్యాఖ్యానించారు . ప్రభాత్ ఝా మాట్లాడుతూ ఢిల్లీలో 60 పైగా సీట్లు  గెలవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. మరో మాజీ శాసనభ్యుడు హరీష్ ఖన్నా, వినోద్‌కుమార్ బిన్నీ కూడా బీజేపీలో చేరుతారని మొదట ప్రచారం జరిగినప్పటికీ ధీర్ ఒక్కరే పార్టీలో చేరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top