మళ్లీ ప్లేట్ ఫిరాయించిన మాజీ సీఎం కూతురు!

మళ్లీ ప్లేట్ ఫిరాయించిన మాజీ సీఎం కూతురు! - Sakshi


న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతుండగా ఆయా పార్టీల అధినేతలలో కంగారు మొదలైంది. పార్టీ కీలక వ్యక్తులు ఎప్పుడు వేరే పార్టీకి జంప్ జిలానీ అవుతారో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ కాషాయతీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం బియాంత్ సింగ్ కూతురు గుర్‌కన్వాల్‌ కౌర్‌ తిరిగి హస్తం పార్టీనే నమ్ముకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం అమరిందర్ కేబినెట్‌లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన గుర్‌కన్వాల్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నేతలు కాస్త టెన్షన్ పడ్డారు. మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కాంగ్రెస్‌లో చేరిక కూడా గుర్‌కన్వాల్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

(చదవండి:  కాంగ్రెస్‌కు షాక్‌..!)



బీజేపీలో ఆమెకు అనుకూల వాతావరణం కల్పించుకునేందుకు సమయంలేదో.. లేక ఎప్పటినుంచో తాను నమ్ముకున్న పార్టీని ఈ సమయంలో వీడటం సరికాదని భావించారో గానీ మాజీ సీఎం తనయ కాంగ్రెస్‌ గూటికి మళ్లీ వచ్చేశారని జాతీయ మీడియా ఏఎన్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్ అభివృద్ధి కోసం తన తండ్రి రక్తం ధారపోశారని, అయినా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబంపై ఎలాంటి సానుభూతి చూపించడం లేదని బీజేపీలో చేరిక సందర్భంలో గుర్‌కన్వాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. గుర్‌కన్వాల్‌కు ఏదో విధంగా నచ్చజెప్పి పార్టీలోకి తిరిగి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తమ పార్టీ కీలకనేతలను వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఇతర పార్టీలకు పంజాబ్ కాంగ్రెస్ సంకేతాలు పంపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top