నడి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ దుర్మార్గం
బదౌన్: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి చెందిన వ్యక్తికి ఓ పోలీస్ స్టేషన్లో చుక్కలు చూపించారు. విచక్షణ రహితంగా అతడిపై లాఠీని ఝళిపించారు. మొబైల్ ఫోన్లో రికార్డయిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతోపాటు తీవ్ర విమర్శలు రావడంతో సదరు పోలీస్ ఇన్స్పెక్టర్ లోకేంద్ర ప్రతాప్ సింగ్ను సస్పెండ్ చేశారు. వీడియో ఫుటేజీ ప్రకారం ఈ ఘటన సోమవారం బదౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో రెండు గ్రూపుల మధ్య గొడవకు సమాజ్వాది పార్టీకి చెందిన యువ నాయకుడు స్వాలే చౌదరే కారణం అని అతడిని స్టేషన్కు తీసుకొచ్చారు.
అనంతరం సరిగ్గా పట్టుకోవాలని ఓ కానిస్టేబుల్కు చెప్పిన ప్రతాప్ సింగ్ అనంతరం లాఠీ తీసుకొని దెబ్బల వర్షం కురిపించాడు. అతడు వేసుకున్న కుర్తాను పైకి జరిపి మరీ తీవ్రంగా కొట్టాడు. అతడు దెబ్బలకు తాళలేక తప్పించుకునే ప్రయత్నం చేయగా గట్టిగా అదిమిపట్టారు. అతడు ఎంత అరుస్తున్నా విడిచిపెట్టకుండా కొడుతుండగా స్టేషన్లో ఉన్న వాళ్లంతా కూడా తమకేమి పట్టనట్లు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 12మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని ఇలాగే ట్రీట్ చేసినట్లు తెలుస్తోంది. సమాజ్ వాది పార్టీలో యువనాయకుడిగా ఉన్న స్వాలే ఇటీవలె అధికారాన్ని కోల్పోయాడు.