సైన్యానికి అపాచీ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత సైన్యం కోసం అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రక్షణ సామగ్రి సేకరణ మండలి(డీఏసీ) రూ.4,168 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. మరో మూడేళ్లలో వీటిని భారత సైన్యానికి అప్పగించనున్నారు.
ఒప్పందంలో భాగంగా బోయింగ్ సంస్థ దాడికి ఉపయోగించే ఆరు అపాచీ హెలికాప్టర్లతో పాటు ఆయుధ వ్యవస్థ, మందుగుండు, విడిభాగాలు, శిక్షణ అందించనుంది. 2015, సెప్టెంబర్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఆర్డర్ ఇచ్చిన 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లకు అదనంగా ఇవి భారత అమ్ములపొదిలో చేరనున్నాయి.