తండ్రిని ప్రిన్సిపాల్ చెప్పుతో కొట్టడంతో..
న్యూఢిల్లీ: కళ్లముందే పాఠశాల యాజమాన్యం తన తండ్రిని అవమానించడంతో ఓ పదమూడేళ్ల ప్రియాన్షి అనే బాలిక నిండు ప్రాణం తీసుకుంది. ఆ అవమానం భరించలేక పట్టుమని పాఠశాల విద్యను కూడా పూర్తి చేయని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఘజియాబాద్ లోని సిహానీ గేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాలిక కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ప్రియాన్షి ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఆమె ఫీజుకు సంబధించి ఉదయాన్నే ఓ టీచర్ విద్యార్థిని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మరోసారి మధ్యాహ్నం ప్రిన్సిపాల్.. మరో ముగ్గురు టీచర్లు కలిసి వెళ్లారు. అక్కడే ఫీజు గురించి అడుగుతూ విద్యార్థిని కళ్లముందే ఆమె తండ్రిని ప్రిన్సిపాల్ చెప్పుతో కొట్టాడు. అంతటితో ఆగకుండా తండ్రే తప్పుచేశాడన్నట్లుగా పోలీసులను పిలిచి అరెస్టు చేయించి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇది చూసి అవమానంగా భావించిన ఆ విద్యార్థిని ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.