తమిళనాడులో ఉద్రిక్తత: స్టాలిన్ అరెస్టు
కరువు నివారణ చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్దతుగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా తిరువారూరు బంద్లో పాల్గొన్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. దీంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటుచేయాలని, కావేరీ డెల్టా ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్గా ప్రకటించాలని, హైడ్రో కార్బన్ ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టులను రద్దుచేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, లారీ అసోసియేషన్ సహా అన్ని పక్షాలు బంద్కు మద్దతిచ్చాయి. అధికార అన్నాడీఎంకే, ఇంకా బీజేపీ మాత్రం ఇది రాజకీయ స్టంటు అని కొట్టిపారేశాయి.