'కొవ్వాడ'పై కొనసాగుతున్న చర్చలు


న్యూఢిల్లీ :

కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీతో న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ చర్చలను కొనసాగిస్తున్నట్లు పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీ దివాలా తీసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. దేశంలో అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై ఆచరణ సాధ్యమైన ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను రూపొందించేందుకు భారత అణు విద్యుత్‌ కార్పొరేషన్‌ వెస్టింగ్‌ హైస్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.



ప్రస్తుతానికి ప్రభుత్వం ఏ ఇతర దేశం లేదా కంపెనీల సహకారంతో కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్ర రియాక్టర్ల ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పునరావాసానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రాజెక్టుపై ప్రజలలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు అవగాహనా కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top