జంతర్ మంతర్ దగ్గర ఆప్ నిరసన ర్యాలీ..
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాది పాలనపై ఆప్ నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దాదాపు 200 మంది కార్యకర్తలు, నేతలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. రైతులను వెన్నెపోటు పొడుస్తూ భూసేకరణ సవరణ బిల్లును తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య నెలకొన్న వివాదం, కేంద్రం జోక్యం నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .. ఢిల్లీ అసెంబ్లీ రెండు రోజుల అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలు కట్టబెడుతూ జారీ చేసిన నోటిఫికేషన్ను ఖండిస్తూ తీర్మానం చేయనున్నారు. ఎల్జీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించేందకు కేంద్రం చూస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు.
కాగా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను, అసెంబ్లీ అధికారాలను ప్రశ్నిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలను స్పష్టం చేస్తూ కేంద్ర హోమంత్రి వర్గం జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై హైకోర్టుకూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మండలి తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్పై ఉందని స్పష్టం చేసింది.