నితిన్ గడ్కరీకి రూ. 10 వేల జరిమానా
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్పై పరువునష్టం దావా కేసులో తమ ఆదేశాలు పాటించనందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీలోని ఓ కోర్టు రూ. 10 వేల జరిమానా విధించింది. శనివారం కేసు విచారణ ఉండగా దానికి మూడు రోజుల ముందుగానే అఫిడవిట్ దాఖలు చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను నితిన్ గడ్కరీ అమలుచేయలేదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా అన్నారు. మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన అఫిడవిట్ను శనివారమే సమర్పించారని చెప్పారు. అందుకే రూ. 10 వేల జరిమానా విధిస్తూ, కేసు తదుపరి విచారణను 2015 మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.
అయితే, తాము ఈనెల 18వ తేదీనే అఫిడవిట్ను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ప్రశాంత భూషణ్కు ఇచ్చామని గడ్కరీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ చెప్పారు. కానీ, తమకు శనివారమే అందిందని కేజ్రీవాల్ తరఫున హాజరైన రిషికేశ్ చెప్పారు. కోర్టు గుమాస్తాకు కూడా 18న ఇచ్చినట్లు పింకీ ఆనంద్ వాదించగా, కోర్టుకు కూడా తెలియకుండా అలా ఎలా జరుగుతుందని మేజిస్ట్రేట్ అడిగారు. జరిమానా విధించడం అన్యాయమని పింకీ ఆనంద్ వాదించారు.