192 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల చిట్టా ఇది..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందిన 690 మంది ఎమ్మెల్యేల్లో 192 (28 శాతం) మందిపై క్రిమినల్ కేసులు న్నాయి. వీరిలో 140 మందిపై హత్య తదితర తీవ్రస్థాయి నేరాలున్నాయి. అంతేగాక... 540 (78 శాతం) మంది కోటీశ్వరులున్నట్టు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంయుక్త సర్వేలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీల్లోని మొత్తం 690 మంది సభ్యులు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ల ద్వారా ఈ వివరాలు సేకరించాయి. అత్యధికంగా యూపీలో 36 శాతం, ఉత్తరాఖండ్లో 31 శాతం, గోవాల్లో 23 శాతం, పంజాబ్లో 14 శాతం, మణిపూర్లో 3 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్టు నివేదిక తెలిపింది.
గోవాలో అంతా ధనవంతులే..!
ఇక కోటీశ్వరుల జాబితాలో గోవా టాప్లో ఉంది. గోవా అసెంబ్లీలోని మొత్తం 40 మంది సభ్యులూ కోటీశ్వరులే కావడం విశేషం! పంజాబ్లో 81 శాతం, యూపీలో 80 శాతం, ఉత్తరాఖండ్లో 73 శాతం, మణిపుర్లో 53 శాతం శాసనసభ్యులు కోటీశ్వరులు. యూపీలో అత్యధికంగా రూ.118 కోట్ల ఆస్తులతో ఎమ్మెల్యే షా ఆలమ్ ఉర్ఫ్ గుడ్డూ జమాలి టాప్లో ఉన్నారు. పంజాబ్లో రాణా గుర్జిత్సింగ్ రూ.169 కోట్లు, ఉత్తరాఖండ్లో సత్పల్ మహారాజ్ రూ.80 కోట్లు, గోవాలో మైఖేల్ విన్సెంట్ లోబో రూ.54 కోట్లు, మణిపుర్లో ఆల్ఫ్రెడ్ కన్గామ్ ఎస్ ఆర్థర్ రూ.36 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగివున్నారు.