మాజీ మంత్రిపై జనవరి 28న ఛార్జ్ షీట్


న్యూఢిల్లీ : ఆఫ్రికా మహిళపై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు జనవరి 28వరకు గడువు ఇస్తున్నట్లుగా ఢిల్లీ న్యాయస్థానం పేర్కొంది. గత ఏడాది ఓ అర్ధరాత్రి ఆఫ్రికా మహిళపై సోమనాథ్ భారతి దాడి చేశాడన్న కేసుపై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అంకితా లాల్ విచారణ చేయాల్సి ఉంది. అయితే, మేజిస్ట్రేట్ గైర్హాజరీ కారణంగా ఈ మాజీ మంత్రిపై ఛార్జీషీట్  దాఖలుకు జనవరి 28కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.



మహిళల ఆత్మగౌరవాన్ని భంగపరచడం, మరికొన్ని అభియోగాలపై సోమనాథ్ భారతితో పాటు మరికొంతమందిపై గతేడాది సెప్టెంబర్ 29న 16 సెక్షన్ల కింద కేసు నమోదయిన విషయం  తెలిసిందే. 100 పేజీల ఛార్జీషీట్ తయారు చేసిన ఈ కేసుకు సంబంధించి 41 మంది సాక్షులు ఉన్నట్లు సమాచారం. జనవరి 19, 2014న పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో నిందితులు ఎవరన్న సమాచారం పోలీసుల వద్ద లేదు. డ్రగ్ రాకెట్, వ్యభిచారం లాంటి ఫిర్యాదులు వస్తున్న ఖిర్కి ఏరియాలోని ఇంటికి మాజీ మంత్రి వెళ్లారని మరిన్ని వివరాలను పోలీసులు పొందుపరిచారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top