శ్మశానంలో కల్యాణ వైభవం

శ్మశానంలో కల్యాణ వైభవం - Sakshi


సాక్షి ముంబై: కొత్తదనం కోసం నీటిలో, గాలిలో వివాహాలు జరుపుకుని అందరిని ఆకట్టుకునే జంటలను చూశాం. కాని, మహారాష్ట్ర జాల్నా జిల్లా పరతూర్‌లో ఓ వివాహం ఎవరూ ఊహించని లేని విధంగా శ్మశానంలో జరిగింది. పరతూర్‌లోని వైకుంఠధాం శ్మశానవాటికలో మంజుశ్రీ, ఆకాష్‌ ఒక్కటయ్యారు. ఈ వేడుకుకు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరుకావడం విశేషం.



వివరాల్లోకి వెళ్తే పరతూర్‌లో శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే మసన్‌జోగి (కాటికాపరి) వర్గానికి చెందిన సుభాష్‌ గైక్వాడ్‌ కూతరు మంజుశ్రీ వివాహం మకుంద్‌వాడీలోని అదే వర్గానికి చెందిన సాహెబ్‌రావ్‌ కుమారుడు ఆకాష్‌తో కుదిరింది. అయితే,  శ్మశానంలోనే వివాహం చేయాలని మంజుశ్రీ, ఆకాష్‌ల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బంధుమిత్రులఅందరికీ శుభలేఖలు వెళ్లాయి. అయితే, అందరు ముందుగా వివాహం జరిగే స్థలం పేరు తప్పుగా ముద్రించారని భావించి ఫోన్‌ చేసి మరీ తెలుసుకున్నారు. అయితే అదే సరైన అడ్రస్‌ అని తెలువడంతో వారంతా అవాక్కయ్యారు.



ముస్తాబైన శ్మశానవాటిక...

మంజుశ్రీ, ఆకాష్‌ల వివాహం కోసం వైకుంఠధామ్‌ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించారు. అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేశారు. రంగుల రంగుల పుష్పాలతోపాటు రంగవల్లులు వేశారు. ఈ తంతును వింతగా భావించిన వారు కూడా అక్కడికి చేరుకున్నారు. కొందరు శ్మశానంలో నిజంగా పెళ్లి జరుగుతుందా అనే సందేహంతో కూడా వచ్చిన వారున్నారు. ఆడంబరాలు, కట్నకానుకల పేరుతో భారంగా మారిన పెళ్లి వ్యవహారాన్ని ఇంత సులభంగా పూర్తి చేయటం అందరినీ ఆకట్టుకుంది.


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top