‘పర్యావరణ’ సంయుక్త కార్యదర్శి పీఎస్ అరెస్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం కేసు వ్యవహారం తాజాగా పర్యావరణ మంత్రిత్వశాఖను తాకింది. కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారం లో పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలోని సంయుక్త కార్యదర్శికి పీఎస్గా వ్యవహరిస్తున్న జితేందర్ నాగ్పాల్తోపాటు ఓ యూపీఎస్సీ సభ్యునికి పీఏగా ఉంటున్న విపన్కుమార్ ఉన్నారు. వీరిద్దరినీ గురువారం అరెస్ట్ చేసినట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) రవీంద్ర యాదవ్ వెల్లడించారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి క్రైమ్బ్రాంచ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం తెలిసిం దే. ఇప్పటివరకు మొత్తంగా 16 మందిని అరెస్ట్ చేసింది. తాజా అరెస్టులు రెండో ఎఫ్ఐఆర్కు సంబంధించినవి. ఇందులో ఇంధన కన్సల్టెంట్ లోకేశ్ శర్మతోసహా ఐదుగురు పేర్లు ఉన్నాయి. విపన్కుమార్ ఇంతకుముందు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖలో పనిచేశారు. అక్కడ తనకున్న సంబంధాలతో కీలకమైన రహస్య పత్రాలను తస్కరించి.. లోకేశ్ వర్మకు అప్పగించేవాడని వెల్లడైంది. పోలీసులు లోకేశ్ను విచారించిన సందర్భంగా విపన్కుమార్, జితేందర్ నాగ్పాల్ల పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం.