ఏకంగా పోలీసును ఈడ్చుకొచ్చి నడి రోడ్డుపై..
భోపాల్: ‘నిబంధనలు సామాన్య జానాలకే. మాకు వర్తించవు.. మమ్మల్ని అడిగితే ఇలాగే కొడతాం’ అన్న తీరుగా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడమే కాకుండా పరిమితికి మించి ముగ్గురు కూర్చుని వెళుతున్న బీజేపీ నాయకుడి కుటుంబానికి చెందిన యువతులను ప్రశ్నించినందుకు ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారు. అతడిపై పిడిగుద్దులు, తన్నుల వర్షం కురిపించారు. ఏకంగా ఐదుగురు ఒకేసారి మీదపడి చిత్తుగా దాడి చేసి కొట్టారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం తర్వాత గునాలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వెలుపల చోటు చేసుకుంది.
చూస్తున్నవారంతా తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించవారే తప్ప ఇదేం అన్యాయం అని ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. పోలీసుల వివరాల ప్రకారం.. గునాలోని శోభనా రఘువంశి అనే వ్యక్తి అక్కడ బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఒకే వాహనంపై హెల్మెట్ లేకుండా వెళుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు వారికి ఫైన్ వేశారు. ఈ విషయం వారు ఇంటిక ఫోన్ చేసి చెప్పడంతో శోభనా భర్త రాజీవ్ రఘువంశీ కొంతమందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఆ వెంటనే నేరుగా కంట్రోల్ రూమ్కు వెళ్లి సినిమాల్లో చూపించినట్లు ఓ రౌడీ ఎలా దాడి చేస్తాడో అలా ఆ పోలీసును కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. చివరకు అతడిని మిగితా పోలీసులే రక్షించారు. ఈ సమయంలోనే ప్రతి ఒక్క పోలీసుకు రాజీవ్ హెచ్చరికలు జారీ చేశారు.